ఎల్లారెడ్డి, నవంబర్ 26,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
భారత ప్రజలు స్వేచ్చగా జీవించడానికి ఆధారమైన రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని , తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ యూసుఫ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 75 రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్ర పటానికి ప్రిన్సిపాల్, అధ్యాపకులు పూలమాలలు వేసారు. పిదప ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేశ ప్రజలు స్వేచ్చగా జీవించడానికి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అని గుర్తు చేశారు. అనంతరం కళాశాలలో రాజనీతి శాస్త్రాన్ని బోధిస్తున్న అధ్యాపకులు వీరేశంకు ప్రిన్సిపాల్, తోటి అధ్యాపకులు ఘనంగా సన్మానం చేసారు. ఈ సందర్భంగా అధ్యాపకులు వీరేశం మట్లాడుతూ భారత రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే దేశంలో నేడు అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛాయుత జీవితాలను అనుభవిస్తున్నారని అన్నారు. కుల, మత ప్రాంతీయ బేధాలు లేకుండా అందరూ ఒక్కటిగా కలిసి ఉంటూ జాతి సమైక్యతకు కాపాడు తున్నారని పేర్కొన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని వర్గాలకు సమాన న్యాయాన్ని పంచుతూ పరిపాలన కొనసాగిస్తు న్నాయని వివరించారు. భారతదేశ ప్రజలందరూ కులమత బేధం లేకుండా ఐకమత్యంలో కొనసాగేందుకు రాజ్యాంగం ఎంతగానో తోడ్పడుతుందని ప్రతి విద్యార్థి ఉత్తమ మార్గంలో పయనిస్తూ రాజ్యాంగ ఫలాలను భావితరాలకు అందజేయాలని సూచించారు. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలలోనే అత్యున్నత మన రాజ్యాంగమని దీని ప్రాధాన్యతను ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు.సంతోష్, శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సంగన్నగారి శ్రీకాంత్, మల్లేశం, హరిక, సతీష్, శ్రీకాంత్, సిబ్బంది.నరసయ్య, సోటేరియా, లక్ష్మి పాల్గొన్నారు.