Home తాజా వార్తలు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు పకడ్బందీగా సేకరించాలి రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు పకడ్బందీగా సేకరించాలి రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

by Telangana Express

కామారెడ్డి, డిసెంబర్ 11:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 80 లక్షల మంది వివరాలను డిసెంబర్ నెలాఖరు లోగా పకడ్బందీగా సేకరించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బుధవారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుంచి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, నూతన డైట్ మెనూ పెంపు ప్రారంభోత్సవం కార్యక్రమం, సంక్షేమ హాస్టల్స్ తనికి , తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన నేపథ్యంలో మనం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ డిసెంబర్ 9 వరకు ఘనంగా నిర్వహించిన వేడుకలకు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ, కుల సర్వే ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా పూర్తి చేసిన నందులకు జిల్లా కలెక్టర్లను,అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. డిసెంబర్ 5న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల యాప్ ప్రారంభించుకున్నామని అన్నారు. ప్రజాపాలన ద్వారా మనకు సుమారు 80 లక్షల వరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు వచ్చాయని, ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా 80 లక్షల దరఖాస్తులకు సంబంధించి సంపూర్ణ వివరాలు డిసెంబర్ నెలాఖరు లోపు సేకరించాలని, ప్రతి 500 ఇండ్ల దరఖాస్తుల సర్వే కోసం ఒక సర్వేయర్ ను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పంచాయతీలలో,మున్సిపాలిటీలలో,కార్పొరేషన్లలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను నియమించామని, వీరిని సమన్వయం చేసుకుంటూ వివరాల సేకరణ జరగాలని, షెడ్యూల్ ముందస్తుగానే ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలకు తెలియజేయాలని మంత్రి సూచించారు.
ప్రస్తుతం మనం ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సేకరించే డేటా రాబోయే 4 సంవత్సరాలు ఉపయోగ పడుతుందని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పక్కాగా వివరాల సేకరణ ఉండాలని అన్నారు. ఈ సర్వేలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తు వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి ఫోటో నమోదు చేయాలని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పిల్లలకు అందించే డైట్ చార్జీలను 40 శాతం పెంచిందని, డైట్ చార్జీల పెంపు లాంచ్ కార్యక్రమంతో పాటు ఈ విద్యా సంస్థలను రెగ్యులర్ గా తనిఖీ చేయాలని, ఈ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన ఆహారం అంది దిశగా కృషి చేయాలని అన్నారు. హస్టల్స్ కు సన్న రకం బియ్యం సరఫరా చేస్తున్నామని, ఇందులో అధికంగా నూక వస్తుందని ఫిర్యాదులు ఉన్నాయని వీటిని పరిశీలించి కలెక్టర్లు నాణ్యమైన బియ్యం, విద్యాసంస్థలకు చేరేలా చూడాలని మంత్రి ఆదేశించారు.

రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. ప్రజా పాలన ద్వారా సేకరించిన దరఖాస్తు లలో ఇందిరమ్మ ఇండ్ల కింద ప్రభుత్వానికి 80 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిని సర్వేయర్ ద్వారా ఇంటింటికి తిరుగుతూ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ప్రతి 500 ఇండ్ల దరఖాస్తులు సర్వే కొసం ఒక సర్వేయర్ చొప్పున సర్వే చేసేందుకు అవసరమైన సిబ్బంది గుర్తించి వారికి శిక్షణ కార్యక్రమం 2 రొజులలో పూర్తి చేయాలని అన్నారు. సర్వే కోసం నగరంలోని వార్డు అధికారులు, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్, రూరల్ ప్రాంతాల్లో గ్రామస్థాయి సిబ్బంది సర్వేయర్ లుగా నియమించాలని అన్నారు.
ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కొసం దరఖాస్తు చేసుకున్న ప్రజలకు యాప్ ద్వారా సిబ్బంది వివరాల సేకరణకు వస్తున్నారని ముందస్తు సమాచారం అందించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పై ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం నూతన దరఖాస్తులు తీసుకోవడానికి వీలు లేదని, పాత దరఖాస్తుల పరిశీలన కొసం మాత్రమే సర్వే చేస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. ప్రతి సర్వేయర్ రొజుకు 20 ఇండ్ల దరఖాస్తుల సర్వే పూర్తి చేయాలని అన్నారు.
గ్రూప్ 2 పరీక్షలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ అధికారులకు సూచించారు. డిసెంబర్ 14న జిల్లాలలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, మాడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, కేజిబీవి లో 40% డైట్ చార్జీల పెంపు లాంచ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు.
డైట్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించాలని, ముఖ్యంగా తల్లి హాజరయ్యే విధంగా చూసుకోవాలని అన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డైట్ చార్జీల పెంపు లాంచ్ కార్యక్రమం జరగాలని, ఆ రోజు విద్యార్థులకు స్పెషల్ ఆహారం అందించాలని, ప్రతి విద్యా సంస్థలు మెన్యు కు సంబంధించి వివరాల ఫ్లెక్సీ ప్రచురణ చేయాలని అన్నారు. పాఠశాలల్లో వంట గది నిర్వహణ, పిల్లలకు అందించాల్సిన నాణ్యమైన ఆహారం తదితర అంశాలపై స్టాఫ్ కు అవగాహన కల్పించాలని అన్నారు. డైట్ చార్జీల పెంపు కార్యక్రమంలో మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొనేలా చూడాలని సీఎస్ తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం మాట్లాడుతూ, గ్రూప్ 1 & గ్రూప్ 3 పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని, ఈ సంవత్సరం చివరగా గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్ 15,16వ తేదీలలో 2 సెషన్స్ లలో జరుగుతాయని అన్నారు. గ్రూప్ 2 పరీక్షలలో అభ్యర్థులకు ప్రత్యేకంగా ఓఎంఆర్ షీట్ అందించడం జరుగుతుందని అన్నారు.
గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ సంబంధించి చేసిన ఏర్పాట్లను, పాటించాల్సిన నియమాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రతి పరీక్ష చాలా కీలకమని, ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాటు జరగకుండా పకడ్బందీగా పరీక్షను నిర్వహించాలని చైర్మన్ కలెక్టర్లను కోరారు.
ప్రతి అభ్యర్థికి ఓఎంఆర్ షీట్ ప్రత్యేకంగా ఉన్నందున పరీక్ష హాలలో అభ్యర్థి రాకపోయినా అతని స్థానంలో ఓఎంఆర్ షీట్ ప్రశ్నాపత్రం అలాగే పెట్టాలని, ఒకరి ఓఎంఆర్ షీట్ మరొకరికి ఇవ్వడానికి వీలు లేదని, పరీక్షా కేంద్రాలకు అభ్యర్థుల సకాలంలో చేరుకునేలా ముందుగానే విస్తృత ప్రచారం జిల్లాలలో కల్పించాలని, పరీక్ష సమయాలు , గేటు ఏ సమయంలో మూసి వేస్తాం వాటి అంశాలు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ఈ నెల 14 న జరిగే డైట్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖులను ఆహ్వానించాలని, అలాగే విద్యార్థుల తల్లులను ఆహ్వానించాలని తెలిపారు.

ఈ వీడియో సమావేశంలో ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈవో చందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment