కల్వకుర్తి జనవరి 27(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే ధ్యేయంగా తరగతిగదుల్లో ఉపాధ్యాయుల విద్యా బోధన కొనసాగించాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రమేష్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు.సోమవారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కల్వకుర్తి మండలంలోని ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులనుదేశించి డీఈవో రమేష్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలకు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యా పై ప్రత్యేక దృష్టి సాధించిందని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అదే తరహాలో ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యున్నతికి పని చేయాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపైన ఉంటుందన్నారు.
ప్రాథమిక స్థాయి నుండి అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులు రాణించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు చతుర్విద ప్రక్రియలు వచ్చేలా చూడాలని, ప్రతి ఉపాధ్యాయుడు బోధనలో మెళకువలు పాటించాలన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు.
విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం రూపొందించిన (అపార్ ఐడి) ఆటోమేటేడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ ఐడి ఆన్లైన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఉపాధ్యాయులను డిఈవో ఆదేశించారు.నిరంతర సమగ్ర మూల్యాంకనం తదితర అంశాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి విద్యార్థి సమగ్ర వివరాలను ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఇఓ హెచ్చరించారు.ప్రతి నెలలో మూడో శనివారం నిర్వహించే టీచర్స్ పేరెంట్ సమావేశాలను విధిగా నిర్వర్తించి విద్యార్థుల సామర్థ్యాలు హాజరు తదితర అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించాలని సూచించారు.
అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని డీఈఓ పరిశీలించారు నాణ్యమైన రుచికరమైన మధ్యాహ్నం భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలను డీఈవో పరిశీలించారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను డిఈవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మండల విద్యాధికారి శంకర్ నాయక్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రసన్న ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


