అమరావతి, మే 22:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
నరసరావుపేట టూ టౌన్ సిఐ భాస్కర్ పై చర్యలు తీసుకోవాలని, సీనియర్ జర్నలిస్ట్ పగడాల రమేష్ పై పెట్టిన తప్పుడు కేసును తీసివేయాలని కోరుతూ, రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాని బుధవారం జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, సెక్రటేరియట్ జర్నలిస్టులు కలిసి వినతి పత్రాన్ని అందించారు. నరసరావుపేట అల్లర్లలో ఎలాంటి విచారణ లేకుండా జర్నలిస్టుని అన్యాయంగా కేసులో పెట్టారని ఎన్నికల అధికారి మీనాకి వారు వివరించారు. కొంతమంది పోలీసు అధికారులు జర్నలిస్టుల హక్కులను కాల రాస్తున్నారని ఎలక్షన్ కమిషన్( EC) మీనాతో ఆవేదన వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించిన ఈసీ ముఖేష్ కుమార్ మీనా విచారణ జరిపించి పల్నాడు జిల్లా కలెక్టర్ తో విచారణ జరిపించి బాధితుడికి న్యాయం చేస్తానని, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ పై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జాప్ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..టూ టౌన్ సిఐ భాస్కర పై రేపు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ లో ఒక పిటిషన్ వేయనున్నామని తెలిపారు
నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ యు జె) అనుబంధ సంస్థ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (JAAP ) రాష్ట్రంలో ఏ జర్నలిస్టు పైన అయినా పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్రంగా పరిగణించి జర్నలిస్టులకు అండగా నిలిచి న్యాయంకోసం పోరాటం చేస్తామని జాప్ ఫౌండర్, ఎన్ యు జె(ఐ) మాజీ అధ్యక్షులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ మెంబర్ ఉప్పల లక్ష్మణ్ , ఎన్ యూజె (ఐ)కార్యదర్శి వి.రాజేందర్ నాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్ట్ లకు ఎన్ యు జె (ఐ), జాప్, యూనియన్ లు అండగా వుంటాయని జాప్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాప్ నాయకులు సెక్రటేరియట్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.