ఎల్లారెడ్డి, మే 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి శ్రీశ్రీశ్రీ కలియుగ దైవం అయిన అయ్యప్ప ఆలయంలో మళ్ళీ దొంగలు పడ్డారు. శుక్రవారం రాత్రి ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి గర్భగుడిలో దొంగ ప్రవేశించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పద్మ శ్రీకాంత్ , ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు. ఉదయం 6గంటలకు పూజారి శ్రీనివాస్ రావు ఆలయానికి వచ్చి గర్భ గుడి తాళం పగుల కొట్టి వుండాటాన్ని చూసి వెంటనే ఆలయ కమిటీ ప్రతినిధులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే కమిటీ ప్రతినిధులు పోలీసులను పిలిపించి సీసీ పుటేజిలను పరిశీలించగా ఆలయ గర్భగుడి తాళాలు పగుల గొట్టి లోనికి వెళ్లిన దొంగ చిత్రం క్లియర్ గా పోలీసులకు చిక్కింది. ఆ చిత్రాన్ని చూసిన పోలీసులు మధ్యాహ్నం వరకు దొంగను పట్టుకొని తీరుతామన్నారు. ఇప్పటికే ఆలయంలో మూడు సార్లు దొంగతనం జరిగింది. దొంగ ప్రతి సారి హుండీ పగుల గొట్టి డబ్బులు తీసుకొని పోతుండటంతో ఆలయ కమిటీ హుండీని తీయించి వేసింది. అంతే కాకుండా ఆలయం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దీంతో దొంగ చిత్రం బయట పడింది. దొంగ పెట్టుబడి అవకాశం ఉంది. ఇప్పటికే రెండుసార్లు దొంగతనం జరగడంతో ఆలయ గర్భ గుడిలో స్వామి విలువైన నగలు పెట్టడం లేదు. దొంగకు గర్భగుడిలో ఎం దొరక్క పోవడంతో ఉదయం పూజకు ఉంచిన పండ్ల బుట్టను ఎత్తు కెళ్లినట్లు గుర్తించారు. అయ్యప్ప ఆలయ గర్భగుడిలోకి ఆలయ పూజారి తప్ప ఎవరికి కూడా ప్రవేశించే అర్హత ఉండదు. దొంగ గర్భగుడి లోపలికి ప్రవేశించడంతో ఆలయ పూజారీ ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనే భక్తుల భారీ విరాళాలతో దాదాపు 4కోట్లకు పైగా వెచ్చించి ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కేరళలోని శబరిమల ఆలయాన్ని పోలి గుడి కుంటల స్థలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కామారెడ్డి జిల్లా కొత్తగా ఏర్పాటుతో మొదటి కలెక్టర్ గా వచ్చిన కలెక్టర్ డాక్టర్.సత్యనారాయణ ఈ ఆలయాన్ని సందర్శించి అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఆలయ నిర్మాణం పూర్తిగా పరిశీలించి ఆలయ నిర్మాణం తీరు పట్ల అభినందించిన విషయం గమనార్హం. అయ్యప్ప ఆలయం ఎదురుగా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం ఉంది. సెలవులు కావడంతో విద్యాలయం కూడా మూసి ఉండటం వల్ల, దొంగ ఆలయ గర్భగుడి పెద్ద తాళాలు పగుల గొట్టిన శబ్దం ఎవరికి వినబడదు. రాత్రి పూట ఆలయ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని భక్తులు పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
కేసు నమోదు చేశాం…దొంగను పట్టుకుంటాం. నైట్ పెట్రోలింగ్ పెంచుతాం…
సీఐ. రవిందర్ నాయక్
ఎల్లారెడ్డి సీఐ. రవీంద్రనాయక్ మాట్లాడుతూ…అయ్యప్ప ఆలయంలో జరిగిన దొంగతనం పై కేసు నమోదు చేశామని దొంగను పట్టుకుంటామని, అలాగే ఆలయం వద్ద రాత్రి పెట్రోలింగ్ పెంచుతామన్నారు.