ఎల్లారెడ్డి, ఏప్రిల్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
వచ్చే నెల మే 13 న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం…వివిధ రాజకీయ పార్టీల నాయకుల ప్రచారంతో రాజకీయాల్లో రోజురోజుకు వేడెక్కుతుంది. నామినేషన్ ల స్వీకరణ పర్వం ముగియడంతో అగ్ర నేతలు అంతా ప్రచారంపైనే దృష్టి సారించారు. మరొక వైపు నామినేషన్ల ప్రక్రియ కొన సాగుతుందని అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. జహీరాబాద్ స్థానం నుంచి ప్రధాన పార్టీలైన బిజేపి, కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపారు. దీంతో మూడు పార్టీల మధ్య హోరాహోరి పోరు కనబడుతుంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా 15 రోజుల గడువు ఉండడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకు నేందుకు ప్రచారం ముమ్మరం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్, జుక్కల్, ఎల్లారెడ్డి , బాన్సువాడ, కామారెడ్డి, ఏడు స్థానాలలో సుమారు 14 లక్షల పైన మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ 2014, 2018 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా రెండుసార్లు బిబి పటేల్ గెలుపొందారు. బిబి పాటిల్ కారు దిగి కమలదళంలో చేరారు. బిఆర్ఎస్ కంచుకోటను కాపాడుకునేందుకు కారు యత్నం చేస్తున్నారు. ఈ స్థానాన్ని ఎలాగైనా కైవాసం చేసుకోవాలని హస్తం పార్టీ పాగా వేసింది. ఈ స్థానాన్ని కమలం వికాసంతో ప్రధాని నరేంద్ర మోడీని మూడవసారి ప్రధాని చేసి ఈ స్తానాన్ని బహుమతిగా ఇవ్వాలని కమల దళం ప్రచారం ముమ్మరం చేసింది.
ప్రచారానికి 14 రోజుల గడువు…
ఈనెల 25 వ తేదీతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో నిచ్చిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షేత్కార్, బిజెపి నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ లు పోరులో ఉన్నారు. ప్రచారానికి మరో 14 రోజుల గడువు ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు నిర్దేశించుకున్న హామీలు పార్టీ మేనిఫెస్టోను ప్రచారంలో ప్రజల ముందుకు తీసుకెళ్లి తమకు అనుకూలంగా మలుచు కునేందుకు రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో తమ విజయాన్ని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ , భాజపా, బీఆర్ఎస్ చెందిన అగ్రనేతలు త్వరలోనే ఎన్నికల ప్రచారానికి జహీరాబాద్ కు రానున్నట్లు సమాచారం. దీంతో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కు తున్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు అయినప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా, బిఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలకు చెందిన అగ్రనేతలు వీరి విజయం కోసం ఎన్నికల ప్రచారానికి రానున్నారు.
రోజురోజుకు ఖాళీ అవుతున్న బీఆర్ఎస్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నప్పటికీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రోజురోజుకు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ, వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, తాజా మాజీ సర్పంచులు, సొసైటీ ఛైర్మన్లు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. దింతో బీఆర్ఎస్ కు రోజురోజుకు గ్రాఫ్ తగ్గుతుంది.
కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎన్నిల ప్రచారంలో జహీరాబాద్ లో రాజకీయం వేడెక్కుతోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో వలసలతో క్యూ కట్టారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ లో భంగపాటు పడి బీజేపీలో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 27000 వేల ఓట్లు సాధించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి యు టర్న్ తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి, తాడ్వాయి ఎంపీపీలు, జడ్పీటీసీ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.
జహీరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగిరెలా వ్యూహం
ఈసారి జహీరాబాద్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేసి ప్రధాని మోడీకి కానుక ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం బీజేపీ ప్రత్యేక వ్యూహలను రచించుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ చేపట్టబోయే సంక్షేమ పథకాలు ఇంటికి తిరిగి ప్రచారం చేస్తూ బీబీ పాటిల్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా కృషి చేస్తున్నారు. ఈ త్రిముఖ పోటీలో గెలుపులో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. జహీరాబాద్ కా బాద్ షా కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే….