రెండో వరుసలో ఎల్లారెడ్డి వైద్యుని పేరు
హైదరాబాద్, జనవరి 19:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ టికెట్ కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేక మంది ఉత్సాహం చూపుతూ, ఎవరికి వారు విశ్వ ప్రయత్నాల్లో నిమగ్నమై వున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ ఖేడ్, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభ జన జరిగిన తర్వాత 2000 ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ విజయం సొంతం చేసుకున్నారు. 2014, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ విజయం సాధించారు. కామారెడ్డి జిల్లా నుండి బీజేపీ తరపున పోటీకి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. బీజేపీ లో సినీయర్ నాయకునిగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిముషం వరకు ప్రయత్నించిన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన పైల కృష్ణారెడ్డి పేరు ఉండి, చివరి నిముషంలో బీజేపీలో అప్పుడే చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో కృష్ణారెడ్డిని అందరూ కూడా టికెట్ రాలేదని పార్టీ మారుతారని ఊహించినప్పటికి ఆయన బీజేపీలోనే వుంటూ, అధిష్టానానికి టచ్ లో వుంటూ, ఇక్కడ జరుగుతున్న సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసినట్లు ప్రచారం జరిగింది. రెడ్డి వర్గానికి చెందిన కృష్ణారెడ్డి జహీరాబాద్ ఎంపీ.బీజేపీ సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనతో పాటు బిచ్కుందకు చెందిన సోమాయప్ప స్వామిజీ బీజేపీ టికెట్ ప్రయత్నంలో వున్నారు. అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ బీజేపీ నేత, డాక్టర్. మురళీధర్ గౌడ్ కూడా జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు టికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో
బోధన్ టికెట్టు కోసం చివరి
నిమిషం వరకు ప్రయత్నించిన మేడపాటి ప్రకాశ్ రెడ్డి కూడా జహీరాబాద్ ఎంపీ. టికెట్టు రేసులో తన ప్రయత్త్నాల్లో వున్నారు. ఆయన నిజామాబాద్ ఎంపీ అరవింద్ తో పార్టీ ముఖ్యనేతలను కలుస్తూ, బీజేపీ టికెట్ దక్కించుకునే ప్రయత్నంలో పావులు కదుపుతున్నారు. తాడ్వాయి మండలానికి చెందిన బాణాల లక్ష్మారెడ్డి, ఇదే మండలానికి చెందిన శాస్త్ర వేత్త పైడి ఎల్లారెడ్డి సైతం బీజేపీ టికెట్ ను ఆశించి టికెట్ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వీరిలో పైడి ఎల్లారెడ్డి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సైతం చేపట్టారు. జుక్కల్ సెగ్మెంట్ నిజాంసాగర్ మండలానికి చెందిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కూడా బీజేపీ జహీరాబాద్ టికెట్ రేసులో వున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి న్యాయవాది రచనారెడ్డి, ఎల్లారెడ్డికి చెందిన ప్రముఖ సర్జన్ డాక్టర్. నాగేశ్వరరావు కూడా బీజేపీ టికెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. డాక్టర్. నాగేశ్వర్ రావు పెరు పరిశీల్సన్ ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం. జై పాల్ రెడ్డి, మాజీ ఎంపీ అలె నరేంద్ర తనయుడు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు ఆలె భాస్కర్ ప్రయత్నాల్లో వున్నారు.
కామారెడ్డిలో బీజేపీ గెలుపు ప్రజల్లో అయోధ్య రామాలయ ప్రారంభ ఊపు, మోడీ మార్క్ ఇవన్నీ బీజేపీ కి అనుకూలంగా ఉండటంతో ప్రతి ఒక్కరి కన్ను బీజేపీ జహీరాబాద్ టికెట్ పై పడింది. జహీరాబాద్ టికెట్ కేటాయింపులో కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఉద్దండులను మట్టి కరిపించిన బీజేపీ ఎమ్యెల్యేగా గెలిచిన కాటిపల్లి రమణారెడ్డి పాత్ర కూడా ప్రధానంగా ఉంటుందన్న చర్చ బీజేపీ ప్రముఖుల్లో విన్పిస్తోంది.