ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న విప్ ఆడ్లూరి లక్ష్మన్ కుమార్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ జనవరి 09
ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి పుణ్యక్షేత్రం శుక్రవారం జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు సుందరంగా ముస్తాబయింది. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారాస్వామి వారిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకానికి అనుగుణంగా ఉత్తర ద్వారా దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నింటిని పూర్తి చేశారు. ఆలయ అధికారి సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఆలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రధాన ఆలయంలో జరిగే ఏర్పాట్లను విప్ ఆడ్లూరి లక్ష్మన్ కుమార్ ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ తగు సూచనలు చేస్తున్నారు.
ఆలయ ప్రాంగణం తో పాటు శిఖర భాగాలను ,విద్యుత్ దీపాలతో అలంక రించారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లను వేశారు. వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా..రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. కావున భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని భక్తుల రద్దీకి సరిపడా లడ్డూ ప్రసాదాలు వసతుల కల్పనకు కావలసిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 5 గంటలకు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామిచే వైకుంఠ ద్వార దర్శనపూజ నిర్వహిస్తామని భక్తులు ప్రశాంత వాతావర ణం లో స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందాలని విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు..ఈ వేడుకలకు గాను ఉత్తర ద్వారమును పూలతో అందంగా అలంకరించి ఉత్సవాలకు సిద్ధం చేశారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారి ఉత్సవ విగ్రహాలను వైకుంఠ ద్వారం నుంచి వచ్చే భక్తుల కోసం దర్శనానికి సిద్దం చేస్తున్నా రు. ఇదిలా ఉంటే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సిఐ రాం నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ,జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొననున్నట్లు ఈఓ తెలిపారు.
పోటో, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు అందంగా ముస్తాబైన ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయం

