Home తాజా వార్తలు మరికల్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

మరికల్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

by Telangana Express

నారాయణపేట జిల్లా, ప్రతినిధి, జనవరి 8 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలను బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో ప్రిన్సిపల్ గది ముందు వేసిన ఆర్ట్ ను బాగుందని మెచ్చుకున్నారు. ఇంటర్ ఎంపీసీ, బైపిసి తరగతి గదులకు వెళ్లి విద్యార్థినుల స్టడీ అవర్ ను పరిశీలించారు. అనంతరం పదో తరగతి ఏ, బీ సెక్షన్ విద్యార్థినులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షలకు ఎలా సిద్ధం అవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. సిలబస్ ఎప్పుడూ పూర్తి అయిందని అడిగారు. డిసెంబర్ లోనే సిలబస్ పూర్తి అయ్యిందనీ, ప్రస్తుతం రివిజన్ చేస్తున్నట్లు విద్యార్థినులు తెలిపారు. చదువుకుని ఏం అవుతారని కలెక్టర్ ప్రశ్నించగా చాలా మంది విద్యార్థినులు డాక్టర్ అవుతామని జవాబిచ్చారు. మరికొందరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని, ఒకరిద్దరు ఐ ఏ ఎస్, ఐ.పీ.ఎస్ అని, ఇంకొందరు వ్యవసాయ అధికారులు అవుతామని చెప్పారు. గతేడాది పది ఫలితాలలో 9.8 జీపీఏ వచ్చిందని ఈ సారి ఎంత జీపీఏ సాధిస్తారని కలెక్టర్ ప్రశ్నించగా అందరూ 10 జిపిఎ సాధిస్తామని తెలిపారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అడగడంతో పాఠశాల ప్రహరీ ఎత్తు చిన్నగా ఉండటంతో కొందరు ఆకతాయిలు గోడ దూకి లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థినులు కలెక్టర్ కి విన్నవించారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ప్రహరీ గోడ ఎత్తు పెంచి నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని ప్రిన్సిపల్ నాగమణి మాల ను ఆదేశించారు. అయితే పాఠశాలలో డ్రైనేజీ వ్యవస్థ చెడి పోవడంతో విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారని ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 21 లక్షలతో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్లు ప్రిన్సిపల్ తెలపడంతో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను ముందు చేయించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల ప్రహరీ చుట్టూ బయటి వైపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయమై స్థానిక ఎస్. ఐ. రాము ను పాఠశాలకు పిలిపించిన కలెక్టర్ ఆకతాయిలు పాఠశాల ప్రహరీ వద్దకు వస్తున్నారని, ఇంకోసారి అది పునరావృతం కాకుండా మహిళా పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ పాఠశాలలోని ఐదో తరగతి విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. విద్యకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ లో వారి నైపుణ్యాలను పరిశీలించారు. పాఠశాలలో టిఫిన్, భోజనం ఎలా ఉంటుందని అడిగిన కలెక్టర్ కు చాలా బాగుoటుoదని తెలిపారు. పాఠశాల అవరణలోకి విష పురుగులు వస్తున్నాయని ఐదో తరగతి విద్యార్థినిలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. విష పురుగులు ఎలా వస్తున్నాయని కలెక్టర్ ప్రశ్నించగా పాఠశాల ఆవరణ, ప్రహరీ చుట్టూ ముళ్ళ పొదలు ఉన్నాయని, వాటి నుంచే వస్తుంటాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఎంపీడీఓ తో మాట్లాడి ముళ్ళ పొదలను తొలగింప చేయాలని ఆర్డీవో రామచందర్ నాయక్ కు కలెక్టర్ సూచించారు. చివరగా కలెక్టర్ పాఠశాలలోని వంటగది, స్టోర్ రూం, బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకుల భద్రపరిచే గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్ లోని అన్ని రిజిస్టర్ల ను ఆర్డీవో పరిశీలించగా, డార్మెంటరీ గదులను కలెక్టర్ పరిశీలించి లైట్లు ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.

You may also like

Leave a Comment