*అక్రమంగా చెట్లు నరికిన వ్యక్తిపై కేసు పదివేలు జరిమానా*
*తెలంగాణ ఎక్స్ప్రెస్ దినపత్రిక కథనానికి స్పందించిన ఫారెస్ట్ అధికారులు*



– అటవీ శాఖ రేంజ్ అధికారి వంశీకృష్ణ
– పర్మిషన్ లేకుండా చెట్లు నరికితే కఠిన చర్యలు.
– ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు దాదాపు తొమ్మిది లక్షలు పెనాల్టీలతో ప్రభుత్వానికి సమకూర్చిన ఆదాయం.
– పలువురిపై కేసులు నమోదు.
నారాయణపేట జిల్లా, ప్రతినిధి, డిసెంబర్ 10 (తెలంగాణ ఎక్స్ ప్రెస్) : జిల్లాలో పలుచోట్ల అక్రమంగా చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తులపై పలు కేసులు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు, ఇదే తరుణంలో నారాయణపేట మండలం సింగారం గ్రామ శివారులో ఈనెల మూడవ తేదీన అటవీశాఖ కార్యాలయానికి అతి సమీపంలో (హ్యాండ్ సా) చేతి మిషన్లతో చెట్లను నరికి వేసిన పేరపళ్ళ గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి పదివేల రూపాయల జరిమానా విధించినట్లు అటవీశాఖ రేంజ్ అధికారి వంశీకృష్ణ తెలియజేశారు. డిసెంబర్ 4న తెలంగాణ ఎక్స్ప్రెస్ దినపత్రిక లో ప్రచురితమైన “ఫారెస్ట్ కార్యాలయ సమీపంలో చెట్లనరికి వేత” అనే శీర్షిక కథనం పాఠకులకు విధితమే. ఇట్టి వ్యక్తిపై గతంలో కూడా కేసులు నమోదు అయినప్పటికీ పెడచెవిన పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నట్లు అధికారు గుర్తించారు. ఇట్టి వ్యక్తి దుశ్చర్యలు సమంజసం కాదని ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు స్పందించి అట్టి వ్యక్తిపై జరిమానా విధించడంతో సింగారం గ్రామంలోని వృక్ష ప్రేమికులు సంతోషం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారి వంశీకృష్ణ ను ప్రశంసిస్తూ పొగడ్తలతో ముంచేత్తారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి ఏప్రిల్ నెలలో జిల్లాకు వచ్చినప్పటినుండి ఇప్పటివరకు పలువురు అక్రమంగా చెట్లు నరికివేసి కలప వ్యాపారం చేసే వ్యక్తులపై పలు కేసులు నమోదు చేసి దాదాపుగా 9 లక్షల రూపాయల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చినట్లు అటవీ శాఖ రేంజ్ అధికారి వంశీకృష్ణ తెలియజేశారు. జిల్లాలో ఎవరైనా అనుమతులు లేకుండా వృక్షాలను, చెట్లను నరికివేస్తే కఠినమైన చర్యలు చేపట్టి, భారీ ఎత్తున జరిమానాలు విధించవలసి వస్తుందని, అక్రమ కలప వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు.