-బిసి కుల గణన హక్కులు ప్రకటించే సందర్భంలో ప్రభుత్వం జాప్యం
-బిసి జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో కులగణన పలు సమస్యలు పరిష్కారానికి ప్రచార కరపత్రాలు ఆవిష్కరణ
-బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్ డిమాండ్
మంచిర్యాల, జూన్ 19, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లూ ఖరారయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాల బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రచార కరపత్రాలను మంచిర్యాలలోని బీసీ భవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామిని నిలబెట్టుకోవాలని తెలిపారు. రిజర్వేషన్లన్ని తేల్చడం కోసం ముందుగా బీసీ జన గణన చేపట్టిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బీసీలు అంటే వెనుకబడిన తరగతి కాదని వెనక్కు నెట్టి వేయబడిన తరగతి వారని పేర్కొన్నారు. జనాభాకి అనుగుణంగా సామాజిక వాటా దక్కితేనే ప్రజాస్వామ్యం నిలబడినట్టు అవుతుందని తెలిపారు. మరో మారు మోసగించబడడానికి బీసీలు సిద్ధంగా లేరని, న్యాయమైన హక్కుల కోసం బీసీ బిడ్డలు ఉద్యమించాలని బీసీ ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షులు చలమల్ల అంజయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి నాయకులు మోతే రామదాసు, మోర చరణ్ కుమార్, రమేష్ కుమార్, బీసీ నాయకులు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.