బాన్సువాడ, ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )పార్లమెంట్ ఎన్నికల్లో అనిల్ కుమార్ కు భారీ మెజార్టీ తేవాలని బాన్సువాడ ఎమ్యెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం మాజీ ఎమ్యెల్యే హన్మంత్ షిందే అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మాజీ సభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ…అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో పెద్ద పొరపాటు జరిగిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఈపొరపాటు జరగొద్దని గాలి అనిల్ కుమార్ ను భారీ మెజార్టీ ఇవ్వాలన్నారు. . బడుగు బలహీన వర్గాలకు చెందిన గాలి అనిల్ కుమార్ ని మన అభ్యర్థిగా మన అధినేత కేసీఆర్ ప్రకటించారని.. గులాబీ కుటుంబ సభ్యులంతా అనిల్ కుమార్ గెలుపు కోసం కృషి చెయ్యలన్నారు. భీముడిలాంటి గాలి అనిల్ కుమార్ గెలుపు కోసం కృష్ణుడు అండగా ఉన్నాడని ఆయన స్పష్టం చేశారు. బాన్సువాడ నుంచి 23వేల ఓట్ల ఆధిక్యాన్ని ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి రూపాయి ఇవ్వని బీబీ పాటిల్ ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడుగుతున్నావు అంటూ ప్రశ్నించారు. బీబీ పాటిల్ కు టికెట్ ఇప్పించి, గెలిపించి పొరపాటు చేశామని పోచారం అవేదన వ్యక్తం చేశారు. కష్టపడి టికెట్ ఇచ్చి, గెలిపిస్తే బీబీ పాటిల్ తన పదవిని వ్యాపారాలు, కాంట్రాక్టుల కోసం వాడుకున్నాడని విమర్శించారు. తుమ్మితే ఊడిపోయేది తమ ప్రభుత్వం అని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని పోచారం శ్రీనివాస రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. నికార్సయిన కార్యకర్తలు పార్టీలో మిగిలారని.. కష్టకాలంలో అండగా ఉన్న కార్యకర్తలు కూడా మా కుటుంబ సభ్యలే అని ఆయన స్పష్టం చేశారు. పంటలకు మద్దతు ధర ఇవ్వనందుకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ నాయకులను గ్రామాల్లోకి రానివ్వడం లేదని తెలిపారు. వచ్చే నెల రోజులు కార్యకర్తలు కష్టపడి గాలి అనిల్ కుమార్ ని గెలిపించాలని పోచారం సూచించారు.
ఉద్యమకారుడిగా కార్యకర్తల కష్టసుఖాలు, రైతుబిడ్డగా అన్నదాతల సాధకబాధలు తెలుసని జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. తనను గెలిపిస్తే పార్లమెంట్ లో మీ గొంతుక అవుతానని కుటుంబ సభ్యునిలా కష్టసుఖాల్లో అండగా ఉంటా అని కార్యకర్తలకు స్పష్టం చేశారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గా అనిల్ కుమార్ గెలుపుకు జుక్కల్ లోని కార్యకరాతలు సైనుకుల్లా పని చేసి భారీ మెజార్టీ ఇవ్వాలని జుక్కల్ మాజీ ఎమ్యెల్యే హన్మంత్ షిందే కోరారు.